
కరాచీ: పాకిస్తాన్ వాణిజ్య రాజధాని కరాచీలో భారీ పేలుడు సంభవించింది. షేర్షా మార్గంలోని ప్రైవేట్ బ్యాంక్ బిల్డింగ్లో పేలుడుతో 14 మంది చనిపోయారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. షేర్షా ప్రాంతంలోని పరాచా చౌక్లో శనివారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి పక్కనున్న భవనాలు కూడా కుప్పకూలాయి. గ్యాస్ లీక్ వల్లే ఈ పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. భవనం శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నట్టు పేర్కొంటున్నారు.
బ్యాంక్ పక్కనే ఉన్న గ్యాస్ స్టేషన్ కూడా ఈ పేలుడులో ధ్వంసమయ్యింది . మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్లను కాపాడడానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నట్టు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నాలా ద్వారా ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్లైన్తో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు.
Source: Tv9





