
-
ఏఐఎంఐఎం అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారాలు చేస్తున్నాయి. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం యూపీలో పాగా వేయాలని చూస్తున్నారు. ముస్లిం సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎంకి చెందిన ఓ జిల్లా అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఓవైసీని ప్రధాన మంత్రి చేసేందుకు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇచ్చారు.
ఏఐఎంఐఎం అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ ఆ వీడియోలో మాట్లాడుతూ…’ పిల్లలు లేకపోతే మనం రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? ఓవైసీ సాబ్ ఎలా ప్రధాని అవుతారు. శైకత్ సాబ్ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? దళితులు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనకూడదని కట్టడి చేస్తున్నారు. అలా ఎందుకు? అది షరియత్కు వ్యతిరేకం.’ అని పేర్కొన్నారు. ఆ వీడియో బుధవారం రికార్డ్ చేసినట్టు తెలుస్తోంది.
Source: EtvBharat





