
లండన్: భారత ప్రయాణికులపై బ్రిటన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనల తరహాలోనే కేంద్రం ఇప్పుడు బ్రిటన్ నుంచి వచ్చే వారిపై విధించనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. బ్రిటన్ నుంచి వచ్చిన వారు టీకా తీసుకున్నా సరే 10 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిందే అని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నాయి.
ఈ నెల నాలుగేతేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్టు తెలిపాయి. ఈ నిబంధనల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చే వారు ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అదే విధంగా వారు భారత్కు వచ్చి ఎనిమిది రోజులు పూర్తయ్యాక మరోసారి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. కొవిషీల్డ్ను గుర్తింపుపై బ్రిటన్ అనుసరిస్తున్న వైఖరికి బదులుగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్ వెళ్లే వారికి 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ అక్కడి అధికారులు పెట్టిన నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. వాటిని తీవ్రంగా ఖండిస్తున్న భారత్.. అలాంటి నిబంధనలు వివక్షపూరితమేనని స్పష్టం చేసింది.





