News

వ్యాక్సినేషన్‌లో మళ్లీ భారత్‌ రికార్డ్‌!

Doctor drawing up Covid-19 vaccine from phial bottle and filling syringe injection for vaccination. Close up of hand with blue surgical gloves taking sars-coV-2 vaccine dose from vial with syringe.
710views
  • మధ్యాహ్నం వరకు కోటి డోసుల పంపిణీ

న్యూఢిల్లీ: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారతదేశం మళ్లీ రికార్డ్‌ సాధించింది. ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం వరకు కోటి డోసులు విజయవంతంగా పంపిణీ చేసింది. శుక్రవారం ఒక్క రోజే.. మధ్యాహ్నం 1:30గంటల వరకు కోటికిపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో ఈ ఘనత సాధించడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని.. శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్‌ డోసులను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ… అందుకు అనుగుణంగా.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాగుతోంది.

‘ప్రధాని మోదీ పుట్టిన రోజున, మధ్యాహ్నం 1:30 వరకు, దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కోటి మార్కును దాటేసింది. అత్యంత వేగంగా కోటీ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. ఇదే వేగంతో ముందుకెళుతున్నాం. టీకా పంపిణీలో శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించి, ప్రధాని మోదీకి జన్మదిన కానుకగా ఇస్తామని మాకు నమ్మకం ఉంది.’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా అన్నారు.

అంతకుముందు.. సెప్టెంబర్‌ 6, ఆగస్టు 31, ఆగస్టు 27న వ్యాక్సినేషన్‌లో కోటి మార్కును అందుకుంది భారత్‌. దేశవ్యాప్తంగా జనవరిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి 10 కోట్ల డోసుల పంపిణీకి 85 రోజులు పట్టింది. అనంతరం 20 కోట్ల మార్కుకు 45 రోజులు, 30 కోట్ల మార్కుకు 29 రోజుల సమయం పట్టింది.

ఆ తర్వాత వేగాన్ని మరింత పెంచిన ఇండియా.. కేవలం 24 రోజుల్లోనే 40 కోట్లు, 20 రోజుల్లో 50 కోట్ల మార్కును దాటేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 19 రోజులకే 60 కోట్లు, 13 రోజులకే 70 కోట్లు అందుకుంది. శుక్రవారం ఉదయం నాటికి దేశంలో 77.24కోట్ల టీకా డోసుల పంపిణీ చేశారు. శరవేగంగా టీకాలు అందిస్తున్న భారత్‌కు ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అనేకమార్లు అభినందించింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి