
విశాఖపట్నం: హిందువుల పండగ వినాయక చవితిని మండపాల వద్ద చేయొద్దని, ఇళ్ళ నుండి బయటకే వస్తే అరెస్టు చేస్తామని రాష్ట్ర సర్కారు హెచ్చరించడంతో హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘వినాయక చవితి ఉద్యమం’ నగరాల నుంచి గల్లీకి పాకి, తీవ్రమవుతోంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర పట్టణాల్లో రాష్ట్రప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా హిందూ సంఘాలు, భారతీయ జనతా పార్టీ శ్రేణులు నిరసనలు, ఆందోళనలు, భారీ ఎత్తున ర్యాలీలు జరిపిన విషయం విదితమే.
తాజాగా, ఈ ఉద్యమం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో బుధవారం జరిగింది. స్థానిక టీటీడీ కళ్యాణ మండం వద్ద బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు సుజాత రాజ్ ఆధ్వర్యంలో గణపతి మండపాలు వద్దని వైఎస్సార్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని రద్దు చేయాలని, మండపాలకు అనుమతి ఇవ్వాలని భక్తులు ధర్నా చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా గణపతి విగ్రహాన్ని ఊరేగిస్తూ నినాదాలు చేస్తూ, ర్యాలీ చేశారు.
హిందువులు ఐక్యంగా ఉండాలని, నిత్యం హిందువుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతిని విరమించుకోవాలని జగన్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సివుంటుందని మరోసారి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి నాయుడు, వైస్ ప్రెసిడెంట్ కలిగొట్ల సుబ్రహ్మణ్యం, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మురళీమోహన్, తూర్పు నియోజకవర్గం డివిజన్ ప్రెసిడెంట్లు సుభాని, సాయి కృష్ణ, మల్లేశ్వరి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రసాద్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఆరిలోవ మండల ప్రెసిడెంట్ వడ్డే నాగరాజు, కె.సతీష్, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.





