దేశమే ఎప్పటికీ ముందు అన్న భావనతో పని చేయాలి… ‘ఐక్య భారత్ శ్రేష్ఠ భారత్’ నినాదాన్ని మదిలో ఉంచుకోవాలి.. ఐపీఎస్ లకు ప్రధాని సూచన..

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించాల్సిన బాధ్యత ప్రొబెషనరీ ఐపీఎస్ లపై ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉన్నతాధికారులుగా మీరు చేసే ప్రతి పనిలో ‘దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతిబింబించాలని అన్నారు. హైదరాబాద్ లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్ లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. వారికి పలు సూచనలు చేశారు.
అధికారులుగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో జాతి ప్రయోజనాలనే దృష్టిలో పెట్టుకోవాలని ప్రధాని మోడీ ప్రొబెషనరీ ఐపీఎస్ లకు సూచించారు. ‘ఐపీఎస్ అధికారుల వృత్తిలోని రాబోయే 25సంవత్సరాలు.. భారత్ అభివృద్ధిలో కీలకమైన 25సంవత్సరాలుగా మారనున్నాయి. ముఖ్యంగా విధుల్లో భాగంగా దేశంలో ఎన్నో ప్రాంతాల్లో పనిచేసే అవకాశం ఉన్నందున వేర్వేరు పాత్రలు పోషిస్తారు. దీంతో ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీసు వ్యవస్థను నిర్మించాల్సిన అతిపెద్ద బాధ్యత మీ అందరిపై ఉంది’ అని ప్రొబెషనరీ ఐపీఎస్లకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశమే ముందు, ఎప్పటికీ ముందు అనే భావన ప్రతి పనిలోనూ ప్రతిబింబించాలని చెప్పారు. అంతేకాకుండా ఐక్య భారత్, శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలన్నారు.





