
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు బలం పుంజుకుంటున్నారు. నాటో దళాల ఉపసంహరణ నేపథ్యంలో పూర్వం తమ అధీనంలో ఉన్న ప్రాంతాలను ఒక్కొక్కటిగా తిరిగి స్వాధీనం చేసుకుంటున్నారు. అఫ్గాన్లో ఇప్పటికే మెజారిటీ భూభాగం తాలిబన్ల వశమైంది. ఈ పరిస్థితులపై అక్కడి మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ స్వేచ్ఛ, రక్షణకు భంగం కలుగుతుందని కలవరపడుతున్నారు.
దోహా ఒప్పందం ప్రకారం అమెరికా సేనలు, నాటో దళాలు వైదొలగడంతో అఫ్గానిస్థాన్లో తాలిబన్ల ఆక్రమణలు పెరిగిపోయాయి. అఫ్గాన్లో మెజారిటీ భూభాగాన్ని ఇప్పటికే తాలిబన్లు ఆక్రమించుకున్నారు. తాలిబన్ ఉగ్రవాదులతో తలపడలేక ఇప్పటివరకు 1600 మందికిపైగా అఫ్గాన్ సైనికులు పొరుగున్న ఉన్న తజకిస్థాన్కు పారిపోయారు. అఫ్గాన్లో తాలిబన్లు బలం పుంజుకోవడం ఆ దేశ మహిళల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే తాలిబన్లు మానవ హక్కుల్ని అణచివేసి బహిరంగ ఉరిశిక్షలను సమర్థిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే టీవీ, సినిమాలు చూడటం.. సంగీతం వినడాన్ని తాలిబన్లు ఒప్పుకోరు. 10 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు పాఠశాలకు వెళ్లడాన్ని కూడా వీరు ఆమోదించరు.
అధికారం తాలిబన్ల చేతికొస్తే తమ స్వేచ్చకు, రక్షణకు భంగం వాటిల్లుతుందని అఫ్గాన్ మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళనకు గురవుతున్నారు. అయితే మహిళల పట్ల తమ వైఖరి మార్చుకుంటామని తాలిబన్లు పేర్కొంటున్నారు. మహిళల విద్యకు ప్రాధాన్యమిస్తాంటున్నారు. కానీ తాలిబన్ల మాటల్ని అఫ్గాన్ మహిళలు విశ్వసించడంలేదు.





