
‘భారతదేశానికి నేను దీర్ఘకాలిక అతిథిని’ అని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఆతిథ్యం ఇచ్చిన భారతదేశానికి తాను ఎటువంటి ఇబ్బంది తీసుకురానని స్పష్టం చేశారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ సహ-ఛైర్మన్ జీవి ప్రసాద్, మరికొందరు పాల్గొన్న దృశ్యమాధ్యమ సదస్సులో దలైలామా మాట్లాడారు. అహింస, కరుణ భారతదేశం మూలాల్లోనే ఉన్నందున, ఇతర దేశాలకు ఆదర్శప్రాయమైందని పేర్కొన్నారు. ‘భారతదేశం నా ఇల్లు’ అన్నారాయన. తాను టిబెట్లో జన్మించినప్పటికీ, జీవితంలో అధికభాగం భారతదేశంలోనే గడిపానని తెలిపారు. ఇది తనకెంతో గర్వకారణమని చెప్పారు. భారత్ లౌకిక రాజ్యమని, ఇక్కడ మతసామరస్యం ఎక్కువని చెప్పారు. ‘వంద కోట్లమందికి పైగా జనాభా ఉన్న ఈ దేశం మత సామరస్యానికి ప్రతీక’ అన్నారాయన. ఇదేదో రాజకీయంగా వచ్చింది కాదని, ప్రజల్లోనే ఆ భావన ఉందని స్పష్టం చేశారు. వైద్య, ఆరోగ్య సేవల రంగంలో పనిచేస్తున్న వారిపై ఎంతో బాధ్యత ఉందని, వారు తమ విధులను మరింత సేవా దృక్పథంతో నిర్వర్తించాలని కోరారు. దలైలామా 86వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.





