
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రధానికి ప్రత్యేక సహాయకారిగా ఉన్న ఫైజల్ సుల్తాన్ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ గురువారమే చైనాకు చెందిన టీకా సినోఫాం మొదటి డోసును స్వీకరించడం గమనార్హం.
మరోవైపు పాకిస్థాన్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 6.15 లక్షలకు పైబడగా.. మరణాల సంఖ్య సుమారు 13,700కు పైగా చేరినట్టు తెలుస్తోంది. ఆ దేశంలో నమోదయ్యే ఎక్కువ కేసుల్లో పంజాబ్ ప్రావిన్స్ వాటానే ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వైరస్ విజృంభణను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, ఫ్రంట్లైన్ వారియర్లకు టీకాలు అందిస్తోంది. చైనా బుధవారం పాకిస్థాన్కు ఐదు లక్షల సినోఫాం టీకా డోసులను విరాళంగా అందించింది.





