News

ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే ఉంటే బాగుంటుంది : విచారణ సందర్భంగా అభిప్రాయపడ్డ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

574views

స్కూల్ చిన్నారులకు ఇంగ్లీష్ మీడియం (ఆంగ్లమాధ్యమం)లో బోధన చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ జరిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిందని ధర్మాసనానికి విశ్వనాథన్ తెలియజేశారు. ఒక సబ్జెక్ట్ గా తెలుగును కూడా ఉంచారని ఆయన సుప్రీంకు విన్నవించారు. ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలను చదివించాలని భావిస్తున్న తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అంతేకాదు.. ఇంగ్లీష్ మీడియంలో చదువని ఓ న్యాయవాది ఇంగ్లీషులో వాదనలు వినిపించడానికి పడుతున్న ఇబ్బందులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది విశ్వనాధ్. ఇంగ్లీష్ మీడియం లో చదువుకున్నవారితో సరిసమానంగా వాళ్లు వాదనలు విన్పించలేకపోతున్నారని తెలిపారు.

అయితే, ఈ ఉదాహరణ సరిగాలేదన్న ప్రధాన న్యాయమూర్తి.. మాతృభాషలో చదువుకున్నవారు జడ్జీలు కూడా అయ్యారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంగ్లీష్ తో పాటు మాతృభాషలో విద్యాబోధన కొనసాగుతోందికదా అని కూడా చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా, 96 శాతం తల్లిదండ్రులు ఇంగ్లీష్ కోరుకుంటున్నారని విశ్వనాథన్ న్యాయమూర్తికి విన్నవించారు. తెలుగు కావాలనుకునే వారికోసం మండల కేంద్రంలో స్కూల్ ఉంటుందని.. ఉచిత బస్ సర్వీస్ సౌకర్యం కల్పిస్తున్నారని విశ్వనాథన్ తెలిపారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డ సీజే .. చిన్నారులకు పునాది బాల్యం.. ఆస్థాయిలో మాతృభాషలో విద్య ఉండాలన్నారు. వేరే ధర్మాసనం నుంచి పిటిషన్ వచ్చినందున వచ్చే వారం వివరంగా విచారిస్తామని కేసును వచ్చేవారానికి వాయిదా వేశారు అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి. ఇలాఉండగా, ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురవడంతో ఏపీ సర్కారు సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.