
హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 1 వ భాగం ఇక్కడ చదవండి
హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 2 వ భాగం ఇక్కడ చదవండి
హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ 3 వ భాగం ఇక్కడ చదవండి
సూత్రధారి సెంథిల్?
ఇంత పెద్ద కుట్రతో, ఇన్ని పాత్రలతో నడిపించిన ధర్మస్థల వివాదం వెనుక కీలక పాత్రధారి ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పుడు అందరి చూపు అతడివైపు తిరుగుతున్నాయి. తమిళనాడులోని తిరువళ్లువర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికాంత్ సెంథిల్ ప్రమేయం ధర్మస్థల రగడ నిండా ఉందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి గాలి జనార్దనరెడ్డి ఆరోపించారు. సెంథిల్ ఐఏఎస్ అధికారి. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్గా పనిచేశాడు. వేలాది మృతదేహాల సామూహిక ఖననం హారర్ కథనం ఇతడి సృష్టేనని జనార్దనరెడ్డి ఆరోపించారు. ఈ కుట్ర కేవలం ఇక్కడి వారిదే అనుకోరాదని, దీని వెనుక చాలా విస్తృత పరిధి ఉందని, దుర్మార్గపు రాజకీయాలు ఉన్నాయని అన్నారు. నిజానికి ముసుగు మనిషి లేదా చెన్నయ్య తమిళనాడు వ్యక్తేనని, ఎన్నో ఏళ్లు అక్కడే ఉన్నాడని, చెన్నయ్యకి సెంథిల్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సాన్నిహిత్యం ఉన్న సెంథిల్ ఒత్తిడితోనే ఆదరాబాదరాగా సిట్ను కర్ణాటక ప్రభుత్వం నియమించదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఈ దుస్థితికి తీసుకువచ్చాయని వ్యాఖ్యానించారు. బళ్లారి కేంద్రంగా పనిచేసే ఒక యూట్యూబర్, వామపక్ష సంబంధాలు ఉన్న మరొక ముగ్గురు ఈ కథంతా నడిపించారని, దీనికి దర్శకుడు కూడా సెంథిల్ అని అన్నారు.
సెంథిల్ మీద ఇలాంటి ఆరోపణలు ఎవరు చేసినా అవి కొట్టి పారేయవలసినవి కాలేవు. 2023లో ఇతడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పనిచేశాడు. 2024 ఎన్నికలలో తమిళనాడు నుంచి లోక్సభకు ఎన్నికయ్యాడు. అంటే డీఎంకే సహాయంతో. కాబట్టి ఇందులో డీఎంకే పాత్రను కూడా తేలిగ్గా తీసేయడానికి లేదు. 2024 లోక్సభ ఎన్నిక లకు కాస్త ముందు ఇతడు తమిళనాడులో కాంగ్రెస్ దళిత ప్రముఖుడిగా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావచ్చు నన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇతడి ప్రస్తావ నకి కొసమెరుపు వంటి ఒక పరిణామం ఉంది. ఇతడు 2019లో ఐఏఎస్ హోదాకు రాజీనామా ఇచ్చాడు. కారణం- కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసన. తరువాత తిరవళ్లువర్ లోక్సభ నియోజక వర్గం నుంచి 5,72,165 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. అప్పుడు తమిళనాడులో ఏ ఇతర ఎంపీకి ఇన్ని ఓట్లు రాలేదు. ఇవి చాలు, ఇతడి నేపథ్యం ఏదో తెలియడానికి! నిజానికి ఇతడు డీప్స్టేట్ అడుగుజాడలలో నడిచే మనిషి. దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్గా రాజీనామా చేసినప్పుడే, దేశంలో ప్రజాస్వామిక మూలాలు కనీవినీ ఎరుగని తీరులో రాజీపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీనామా లేఖలోనే ఇతడు పేర్కొన్నాడు. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ అని కూడా విమర్శించాడు.
దీనితోనే అనంతకుమార్ హెగ్డే (బీజేపీ ఎంపీ) ఈ మనిషికి ఈ దేశంలో ఏం పని? పాకిస్తాన్ వెళ్లిపోతే మంచిది అని తీవ్ర విమర్శలు గుప్పించారు. తరువాతే సెంథిల్ కాంగ్రెస్లో చేరి అనతికాలంలోనే వార్ రూమ్ ఇన్చార్జ్ అయ్యాడు. ఇతడు లోక్సభకు పోటీ చేసినప్పుడు ప్రచారమంతా మెజారిటేరియనిజం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి మాటలే అన్నాడు. బీజేపీ దేశాన్ని చీలుస్తుందని చెప్పాడు. ఒక్కసారి కులగణన చేస్తే హిందూరాష్ట్ర భావన మిథ్యగా మిగులుతుందని ఏప్రిల్ 16, 2024న డెక్కన్ హెరాల్డ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఐఏఎస్ హోదాకు రాజీనామా ఇచ్చిన తరువాత ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా జరిగిన అనేక కార్యక్రమాలలో సెంథిల్ పాల్గొన్నాడు. కాంగ్రెస్ తనకు తగిన వేదిక అని కూడా ప్రకటించాడు.
ఒక విధంగా చూస్తే తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తమిళనాడుకు చెందిన కర్ణాటక కేడర్ ఐపీఎస్. సెంథిల్ తమిళనాడుకు చెందిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి. అన్నామలై రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది కాలానికే సెంథిల్ రాజకీయాలలోకి వచ్చాడు. ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థలిని అపఖ్యాతి పాల్జేయడానికే ఇలాంటి ఆరోపణలు తెచ్చారనడం సరికాదని తమిళనాడులోని తిరువళ్లువర్ లోక్సభ నియోజక వర్గ కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ ప్రకటించడం విశేషం. సెంథిల్ కర్ణాటక కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. అలాంటి వాదనలన్నీ నిరాధారాలని కూడా అన్నాడు. కానీ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న తీరులోనే ఇతడి ప్రకటన ఉంది. ఇలాంటి ఆరోపణను ఇంకా ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డిని ఆయన హెచ్చరించాడు.
సశేషం





