News

చైనా బోర్డర్​కు సైకిల్ ​మీద వెళ్ళిన మహిళ

348views

న్యూఢిల్లీ: ఆమెకు 45 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. అయితేనేం! గుజరాత్‌ నుంచి సైకిల్‌పై బయల్దేరి అరుణాచల్‌ప్రదేశ్‌ చేరుకొంది. ఆమె.. పుణెకు చెందిన ప్రీతి మాస్కే. పాకిస్తాన్‌తో ఉన్న పశ్చిమ సరిహద్దులోని కోటేశ్వర్‌ ఆలయం నుంచి ఈనెల ఒకటోతేదీన సైకిల్‌ యాత్రను ఆరంభించింది. గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, బంగాల్‌, అసోం రాష్ట్రాల మీదుగా అరుణాచల్‌ప్రదేశ్‌లోని చైనా సరిహద్దులో ఉన్న కిబితుకు చేరుకొంది. 13 రోజుల 19 గంటల 12 నిమిషాల వ్యవధిలో మొత్తం 3,995 కిలోమీటర్ల యాత్రను పూర్తిచేసింది.

అనారోగ్యం, కుంగుబాటును అధిగమించేందుకు ఐదేళ్ళ కిందట సైకిలింగ్‌పై దృష్టి సారించిన ప్రీతి.. తక్కువ సమయంలోనే దేశంలోని పశ్చిమ భూభాగం నుంచి తూర్పు భూభాగం వరకూ సైకిల్‌పై ప్రయాణించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. వరల్డ్‌ ఆల్ట్రా సైకిలింగ్‌ అసోసియేషన్‌, గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ అధికారులు ఈ సాహసానికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి