
తిరుపతి: శ్రీనివాస సేతు నిర్మాణం పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలో మున్సిపల్ కార్పొరేషన్, స్మార్ట్ సిటి కార్పొరేషన్, టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, కరకంబాడి నుంచి లీలామహల్ సర్కిల్ వరకు నిర్మిస్తున్న అప్రోచ్ మార్గాన్ని సెప్టెంబర్ 25వ తేదీకి పూర్తి చేయాలన్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రామానుజ సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ మార్గాన్నినవంబర్ 30వ తేదీకి పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ నాటికి శ్రీనివాస సేతు నిర్మాణం మొత్తం పూర్తి కావాలని ఆయన చెప్పారు.
ఇందుకు టీటీడీ నుంచి చెల్లించాల్సిన మొత్తాన్ని జాప్యం లేకుండా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు జెఈవో శ్రీ వీరబ్రహ్మం, సిఇ శ్రీ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ, స్మార్ట్ సిటీ కార్పొరేషన్, ఆఫ్కాన్ అధికారులతో ప్రతివారం సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ నెల చివరివారంలో మరోసారి సమీక్ష జరుపుతానని ఈవో చెప్పారు.





