
ముంబాయి: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత షేక్ హుస్సేన్ ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు షేక్ హుస్సేన్పై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిట్టిఖదన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. హుస్సేన్పై కఠిన చర్యలు తీసుకోవాలని, 48 గంటల్లో అరెస్టు చేయాలని, లేని పక్షంలో తీవ్ర ఆందోళనకు దిగుతామని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
జూన్ 13 న జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, మాజీ నగర అధ్యక్షుడు షేక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై కించపరిచే పదజాలం ఉపయోగించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కేంద్ర దర్యాప్తు సంస్థ విచారించినందుకు నిరసనగా నాగ్పూర్లోని ఈడీ కార్యాలయం వెలుపల ప్రదర్శన చేస్తూ.. “జైసే కుట్టే కి మౌత్ హోతీ హై వైసే నరేంద్ర మోడీ కి మౌత్ హోగీ (మోడీ కుక్క చావు చస్తారు)” అని అన్నారు.





