
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ వ్యవహారాన్ని పాకిస్తాన్ మరోసారి లేవనెత్తగా.. దీటుగా స్పందించింది భారత్. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత భారత్తో సంబంధాలు మరింత సంక్షిష్టమయ్యాన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావాల్ భుట్టో. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించింది. పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకుంటోందని మండిపడింది.
తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్ళిన భుట్టో గురువారం మీడియాతో మాట్లాడారు. గోధుమ ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంపై ఆయన స్పందించారు. అది భారత ప్రభుత్వ అంతర్గత నిర్ణయమని.. కానీ, ఇలాంటి చర్యలు అంతర్జాతీయ సంస్థలను నిరుత్సాపరుస్తాయన్నారు. ఆహార భద్రత లక్ష్యాలను చేరుకోలేని వారి అవసరాలను తీర్చేందుకు మన మందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కశ్మీర్ భారత్లో అంతర్భాగం
పాకిస్తాన్ ప్రతి వేదికను భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి ఉపయోగించుకుంటుందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ భద్రతా మండలి నిర్వహించిన ‘అంతర్జాతీయ శాంతి, ఆహార భద్రత’ అంశంపై చర్చలో భారత శాశ్వత కౌన్సిలర్ రాజేశ్ పరిహార్ స్పందించారు.
‘కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లద్దాఖ్.. భారత్లో అంతర్భాగం. ఇందులో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలు ఉన్నాయి. మీరు ఎన్ని విద్వేష పూర్వక ప్రసంగాలు చేసినా ఈ వాస్తవాన్ని కాదనలేరు. పాకిస్తాన్ చేయగల ఏకైక సహకారం.. వారు ప్రోత్సహించే ఉగ్రవాదాన్ని అరికట్టడమే’ అని అన్నారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం తమ అంతర్గత విషయమని అంతర్జాతీయ సమాజానికి భారత్ స్పష్టంగా చెప్పింది. జమ్ము కశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాస్తవాన్ని అంగీకరించాలని.. భారత్ వ్యతిరేక ప్రచారాలని మానుకోవాలని హితవు పలికింది. ఉగ్రవాదం, హింస లేని సంబంధాలను తాము కోరుకుంటున్నామని పాకిస్తాన్కు తెలిపింది.
Source: EtvBharat





