
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు దీని ద్వారా భారత్లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏప్రిల్ 22న సుంజ్వాన్ ప్రాంతంలో ఇద్దరు సూసైడ్ బాంబర్లు.. పుల్వామా తరహా దాడికి తెగబడ్డారు. సీఐఎస్ఎఫ్ బలగాలు ప్రయాణిస్తున్న బస్సు లక్ష్యంగా తుపాకులు, గ్రనేడ్లతో విరుచుకుపడగా.. ఓ ఏఎస్సై ప్రాణాలు కోల్పోయారు. అదే రోజు బలగాలు జరిపిన ఎన్కౌంటర్లో ఆ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది జరిగిన 14 రోజులకు ఇప్పుడు సొరంగాన్ని గుర్తించారు.
అంతర్జాతీయ సరిహద్దులో సొరంగం బయటపడడం.. గత 16 నెలల్లో ఇదే తొలిసారి అని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. మొత్తంగా గత దశాబ్దకాలంలో ఇది 11వ సారి అని తెలిపారు. పాకిస్తాన్ పోస్ట్ ఛమన్ ఖుర్ద్ నుంచి సొరంగం కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉందని, అంతర్జాతీయ సరిహద్దు నుంచి 150 మీటర్ల దూరంలో గుర్తించినట్టు పేర్కొన్నారు.





