
భాగ్యనగరం: ప్రపంచస్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. హైదరాబాద్లోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొంటూ ఇక్రిశాట్లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్రాలను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
సంస్థలో పనిచేసిన, చేస్తున్న ఉద్యోగులకు ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలను ఆయన తెలిపారు. ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణం పెద్ద మైలురాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన అందరికీ అభినందనలు తెలిపారు. వసంతపంచమి రోజు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
టెక్నాలజీని మార్కెట్ తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ ఎంతో కృషి చేస్తుందని ప్రధాని అభినందించారు. సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్ మరింత ముందుకు సాగాలని మోదీ ఆకాక్షించారు. ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగమని చెప్పారు.
Source: Nijamtoday





