
-
సైన్యంపై దాడి, ఎనిమిది మంది మృతి
ఇస్లామాబాద్: బెలూచిస్తాన్లో రెండు వేర్వేరు ప్రాంతాలపై సాయుధ మిలిటెంట్లు దాడులు చేశారు. నోష్కీ, పంజ్గూర్లోని ఎఫ్సీ (ఫ్రాంటియర్ కార్ప్స్) ప్రధాన కార్యాలయంపై జరిగిన సాయుధ మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు ఒక అధికారితో సహా ఏడుగురు సైనికులు మరణించినట్టు పాకిస్తాన్ హోం మంత్రి షేక్ రషీద్ ధ్రువీకరించారు.
పంజ్గూర్లో ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, కొంతమంది సాయుధ మిలిటెంట్లను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయని ఆయన చెప్పారు. నోష్కీ, పంజ్గూర్లలో సాయుధ మిలిటెంట్లు భారీ దాడులకు పాల్పడ్డారని, అయితే భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టాయని హోం మంత్రి ఒక వీడియో ప్రకటనలో తెలిపారు.
“నోష్కీలో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించగా, నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పంజ్గూర్లో ఆరుగురు తీవ్రవాదులు హతమయ్యారు. రెండు ప్రాంతాల్లోనూ తీవ్రవాదులను సైన్యం తరిమికొట్టింది. పంజ్గూర్లో భద్రతా దళాలు కనీసం నలుగురు లేదా ఐదుగురు తీవ్రవాదులను చుట్టుముట్టాయి” అని ఆయన పేర్కొన్నారు.




