News

బిపిన్ రావత్ మరణానంతరం ఆర్మీ కమాండర్ల తొలి సమావేశం

603views

న్యూఢిల్లీ: చీఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన తర్వాత తొలిసారిగా ఆర్మీ కమాండర్లు ఈనెల 23, 24న దిల్లీలో సమావేశం కానున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అనుసరించాల్సిన భద్రతా విషయాలపై చర్చించనున్నారని తెలిపాయి. దేశంలోని అత్యంత సీనియర్‌ సైనికాధికారి, ఆయన భార్య మధులికారావత్‌ సహా మరో 12 మంది సైనికాధికారులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విపత్కర పరిస్థితుల తర్వాత సమావేశం జరగనుంది.

సమావేశంలో అందరు ఆర్మీ కమాండర్లు చైనా, పాకిస్థాన్‌ సహా దేశ సరిహద్దుల వెంబడి ప్రస్తుత భద్రతా పరిస్థితులపై చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తీవ్రమైన చలి నేపథ్యంలోనూ చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి అధిక సంఖ్యలో సైనికులను మోహరించి పర్యవేక్షిస్తున్న భద్రతా చర్యలపై ఆర్మీ కమాండర్లకు వివరించనున్నట్లు వెల్లడించారు.

ఆర్మీలో కొనసాగుతున్న సంస్కరణలపై కూడా కమాండర్లతో చర్చించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీడీఎస్‌ మరణం నేపథ్యంలో తదుపరి సీడీఎస్‌ నియామకంపైనా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి