
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని ద్వాపరయుగంలో పాండవులు నిర్మించారు. 1807-09 మధ్యకాలంలో అప్పటి జమీందారు రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు ఆలయం చుట్టూ ప్రహరీతో పాటు గాలిగోపురం నిర్మించారు. ఈ గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినదిగా చెబుతారు. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతితో నిర్మించారు.
ఈ గోపుర నిర్మాణం పూర్తయిన తర్వాత వెనుక వైపునకు ఒరుగుతున్నట్టుగా శిల్పులు గుర్తించారు. అది నిలదొక్కుకునేందుకు కంచి నిపుణుల సలహాతో గాలిగోపురం ఎత్తుకు సమాన లోతుతో ఎదురుగా కోనేరు తవ్వారు. లోతుగా తవ్వటం వల్ల కోనేరు లోపలికి దిగితే చీకటిగా ఉండేది. అందుకే దీనికి చీకటి కోనేరుగా పేరొచ్చింది.
కోనేరులోని నీటిని ఆలయంలో పూజా కార్యక్రమాలకు వినియోగించేవారు. దివిసీమ ఉప్పెనతో కోనేరు పాడైపోయింది. నిర్వహణ లేకపోవటంతో దాని చుట్టూ గోడ కట్టి వదిలేశారు. అయితే.. చీకటి కోనేరుని మళ్లీ వినియోగంలోకి తేవాలని అధికారులు నిర్ణయించారు. కోనేరు శుద్ధి ప్రక్రియ చేపట్టగా లోపల చిన్నపాటి విష్ణుమూర్తి విగ్రహం బయటపడింది. కోనేరు చుట్టూ పార్కు అభివృద్ధి చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కాసేపు సేదతీరేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.





