
36views
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభంకానున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న మూడు ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు జరుగనున్నాయి. అభయ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి ఆకుపూజ కార్యక్రమం చేయనున్నారు.
మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. నాగవల్లీ దళార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పుష్పాలు, ప్రత్యేక దండలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దేవస్థానం పిలుపునిచ్చింది.





