News

బంగ్లాదేశ్‌లోని అకృత్యాలపై యుఎన్‌ జోక్యం చేసుకోవాలి

853views
  • విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని స్వదేశీ హిందువులపై నిరంతర జిహాదీ మారణహోమాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంను పంపాలని విశ్వహిందూ పరిషత్‌ డిమాండ్‌ చేసింది. అక్కడ హిందువులపై రాడికల్‌ ఇస్లామిక్‌ జిహాదీలు, మత ఛాందసవాదులు చేస్తున్న దారుణాలను నాజీల క్రూరత్వంతో మాత్రమే పోల్చవచ్చని పరిషత్‌ కేంద్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సురేంద్ర జైన్‌ అన్నారు.

ఈ అకృత్యాలు ఆగే పరిస్థితి లేనందున ఇప్పుడు యుఎన్‌ జోక్యం చేసుకోవాలని, అక్కడ తీవ్రమైన వేధింపులకు గురవుతున్న హిందువులకు తక్షణం రక్షణ కల్పించాలని ఆయన కోరారు. అక్కడి జిహాదీల చర్యలకు నిరసనగా బుధవారం భారత దేశంలో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు వీహెచ్‌పీ పిలుపునిచ్చింది. ప్రధాన మంత్రి షేక్‌ హసీనా తన రాజ్‌ ధర్మాన్ని పాటించాలని, మైనారిటీ హిందూ సమాజం భద్రతను నిర్ధారించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పరిషత్‌ కోరింది.

బంగ్లాదేశ్‌ పరిణామాల పట్ల ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వివక్ష ప్రదర్శిస్తున్నాయని జైన్‌ విమర్శించారు. బంగ్లాదేశ్‌ను పూర్తిగా హిందువులు లేని దేశంగా మార్చడానికి ఇస్లామిక్‌ ఫండమెంటలిస్టులు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మూగ ప్రేక్షకుడిగా మారిందని మండిపడ్డారు. గత 10 రోజుల్లోనే 150కి పైగా తల్లి దుర్గా పూజ పండళ్లు ధ్వంసం చేశారని, 362కి పైగా దేవ‌తా విగ్ర‌హాల‌ను ధ్వంసం చేశారని, హిందువుల వందలాది ఇళ్లు, దుకాణాలు దాడికి, దోపిడీకి గురయ్యాయని వివరించారు. 1,000 మందికి పైగా హిందువులు గాయపడ్డారని, ఇప్పటి వరకు 10 మంది హిందువులు కూడా మరణించినట్టు చెబుతున్నారని తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి