
అమరావతి: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కాగా, ఇప్పటికే మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. విశాఖపట్నంలో నిన్న సాయంత్రం భారీ వర్షం పడగా, విజయవాడ, తదితర ప్రాంతాల్లో మబ్బులు కమ్మి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.





