
కోవిడ్-19 మొదట, రెండో వేవ్లలో సంభవించిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య రక్షా సమితి, విజయవాడ ఇప్పటి నుంచే పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా కరోనా వేవ్ వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై 170 మంది ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు నిర్వహించింది. మంగళగిరి ఎయిమ్స్ డాక్టర్ ధనరాజ్ , ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి ఎస్ రావ్ లు పాల్గొని, కోవిడ్ వస్తే తీసుకోవలసిన చికిత్స, జాగ్రత్తలను వివరిస్తూ అవసరమైనవారికి ఆక్సిజన్ ఎలా పెట్టాలి? ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను ఎలా వాడాలి? అనే విషయాలను వివరించారు. పల్స్ ఆక్సీ మీటర్, థర్మల్ మీటర్ మొదలైన వైద్య పరికరాలను వాడే విధానాన్ని కూడా వారు వివరించారు.

గ్రామ గ్రామాన జన జాగరణ ఉద్యమం
ఈ నెల ఒకటోతేదీ నుంచి ఏడో తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో “జన జాగరణ ఉద్యమం” చేపట్టనున్నామని ఆరోగ్య రక్షా సమితి, విజయవాడ ప్రతినిధులు తెలిపారు. ప్రజలకు కరోనా మూడో వేవ్ తో పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించి, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సిన చికిత్స, జాగ్రత్తల గురించి గ్రామ గ్రామానా వివరించనున్నామని చెప్పారు. ఆ మేరకు ఇంటింటికీ పూర్తి వివరాలతో కూడిన ఓ కరపత్రాన్ని కూడా అందించనున్నామని ఆరోగ్య రక్షా సమితి ప్రతినిధులు వివరించారు.





