News

తాలిబాన్ల దెబ్బకు బురఖా ధరించిన సిఎన్ఎన్ రిపోర్టర్… తాలిబన్లు తమతో ఫ్రెండ్లీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు… మీడియా తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

1.1kviews

తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని హస్తగతం చేసుకున్నాక.. అక్కడి పరిస్థితుల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మహిళలపై ఇప్పటికే ఆంక్షలు విధించడంతో బయటకు రావడానికి జంకుతున్నారు. ఓ వైపు ఆఫ్ఘనిస్తాన్ ను వీడాలని భావించిన ఆఫ్ఘన్ పౌరులకు తాలిబాన్లు ఎయిర్ స్పేస్ ను మూసి వేయించి షాకిచ్చారు. ఇక భవిష్యత్తు ప్రశ్నార్థకమైన సమయాన.. అక్కడి వాళ్లు తాలిబాన్ల పాలనకు తగ్గట్టుగా తమ వేషధారణలో మార్పులను చేసుకుంటూ ఉన్నారు.

సి.ఎన్.ఎన్. రిపోర్టర్ క్లారిస్సా వార్డ్ ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్ నుండి పలు విషయాలను తెలియజేసింది. ఆమె ఇంతకు ముందు ఆఫ్ఘన్ నుండి చేసిన రిపోర్టింగ్ కు.. ఇప్పటికీ చాలా తేడాను గమనించవచ్చు. ఆమె ఒక మహిళ అయినందున ఆమెను ఒక వైపు నిలబడమని తాలిబాన్లు సూచించారు. ఇక ఆ దేశంలో మహిళల జీవితం సమూలంగా మారిందని చెప్పుకొచ్చింది. ఆమె హిజాబ్ ధరించి తల నుండి కాలి వరకు నల్లటి దుస్తులు ధరించి రిపోర్టింగ్ చేసింది. ‘అమెరికాకు అంతం’ అంటూ తాలిబాన్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారని.. అదే సమయంలో కాస్త ఫ్రెండ్లీగా కూడా ఉన్నారని తెలిపింది. తనకు అంతా వింతగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. కాబూల్ రోడ్లు మునుపటిలా లేవని.. గతంతో పోలిస్తే తక్కువ మంది మహిళలు కనిపించారని.. అక్కడక్కడా పిల్లలు తిరుగుతూ ఉన్నారని తెలిపింది. సి.ఎన్.ఎన్. రిపోర్టింగ్ ను చాలా మంది తప్పు బడుతున్నారు. ఓ వైపు ‘డెత్ టు అమెరికా’ అని తాలిబాన్లు అంటూ ఉండగా.. మరో వైపు ఫ్రెండ్లీగా ఉన్నారని సి.ఎన్.ఎన్. ఎలా రిపోర్ట్ చేస్తుందని విమర్శలు గుప్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.