
డ్రోన్ దాడులు చాలా ప్రమాదకరమని, దీనివల్ల నష్టం తీవ్ర స్థాయిలో ఉంటుందని బీఎస్ఎఫ్ చీఫ్ రాకేశ్ ఆస్థానా అన్నారు. వీలైనంత త్వరగా భారత్ యాంటీ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు. పశ్చిమాన పాకిస్థాన్, తూర్పున బంగ్లాదేశ్తో కలిసి మొత్తం 6,300కి.మీ మేర సరిహద్దును కలిగి ఉన్నామన్న ఆయన.. తాజా పరిస్థితుల నేపథ్యంలో రక్షణ సంబంధమైన సవాళ్లు ఎదురవుతాయన్నారు.
ఓ వెబినార్లో రాకేశ్ ఆస్థానా మాట్లాడుతూ.. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సొరంగ మార్గాలను, బోర్డర్ సమీప ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ పరికరాలు గుర్తించడం ఇప్పటికే సమస్యగా మారిందని, తాజాగా డ్రోన్లను గుర్తించడం సవాలుగా మారుతోందన్నారు. దీనివల్ల సరిహద్దు భద్రతాదళం పని తీరుపై ప్రభావం పడుతుందని చెప్పారు. అందువల్ల వీలైనంత త్వరగా యాంటీడ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్నారు.
ఇటీవల జరిగిన డ్రోన్ దాడిలో పేలుడు పదార్థాలను మాత్రమే జార విడిచినట్లు తెలుస్తోందని, కానీ, వీటి ద్వారా బాంబులను కూడా ప్రయోగించే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని రాకేశ్ పేర్కొన్నారు. ఇటీవల జమ్ము వాయుసేన స్థావరం వద్ద దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఓ వ్యక్తి నుంచి 4 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఆయుధాలను సరఫరా చేసేందుకు దాయాది దేశం డ్రోన్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో భారత్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.





