
రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లాక్డౌన్లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరోసారి బేజారవుతున్నాయి. ఇది దేశ జీడీపీపైనా పెను ప్రభావం చూపించే అవకాశమున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పలు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రెండో దశలో తీవ్రంగా ప్రభావితమైన రంగాలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం మరో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్నట్లు బ్లూమ్బర్గ్ కథనం పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు పర్యాటకం, విమానయానం, ఆతిథ్య రంగాలకు ఉద్దీపనలు ప్రకటించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(పీహెచ్డీసీసీఐ) కూడా ప్యాకేజీ విషయమై కేంద్రానికి అభ్యర్థనలు చేసింది. ఈ సందర్భంగా వృద్ధికి ఊతమిచ్చేలా 17 సిఫార్సులు చేసింది. ”రెండో దశలో కరోనా తొలి దశకంటే వేగంగా వ్యాపిస్తోంది. దేశంలోని ప్రతి ఇంటిపైనా ప్రభావం చూపిస్తోంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వాణిజ్య వ్యాపారాలను ఆదుకునేందుకు ప్రాధాన్యమైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించాలి” అని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉండగా.. మహమ్మారి ఉద్దృతితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయే అవకాశముందని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.





