
పశ్చిమ్ బెంగాల్ తొలిసారిగా ఆ రాష్ట్రంలోని కొవిడ్-19 మరణాల సంఖ్యను బహిర్గతం చేసింది. కరోనా వైరస్తో 57 మంది మృతిచెందారని వెల్లడించింది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులుండి వైరస్తో చనిపోయిన వారి సంఖ్య 39గా పేర్కొంది. వీటిని కరోనా లెక్కల్లోకి తీసుకోలేదని తెలుస్తోంది.
కొవిడ్-19తో రాష్ట్రంలో 18 మంది మరణించారని బెంగాల్ ఆడిట్ కమిటీ తెలిపింది. కరోనా మరణాల గురించి కేంద్రం పంపించిన బృందాలు ప్రశ్నించడంతో ఆడిట్ కమిటీ ఈ వివరాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అనుసరించే మరణాలను ధ్రువీకరిస్తున్నారని కేంద్ర బృందం వారిని పశ్నించింది. ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ సిన్హాకు అపూర్వ చంద్ర నేతృత్వంలోని కేంద్రం బృందం లేఖ రాసింది. కరోనా మరణాన్ని ధ్రువీకరించేందుకు కమిటీ ఎంత సమయం, ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటోందని కేంద్ర బృందం అడిగినట్టు తెలిసింది.
‘ఒకవేళ కొవిడ్-19 రోగి రహదారి ప్రమాదంలో చనిపోతే దానిని కొవిడ్ మరణంగా పరిగణించలేం కదా’ అని బెంగాల్ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిన తర్కం గురించీ కేంద్రం బృందం లేఖలో ప్రస్తావించింది. ‘వ్యాధితో ఆస్పత్రిలో మరణించడం, రహదారి ప్రమాదంలో మృతికి సంబంధంతో కేంద్ర బృందం సంతృప్తి చెందలేదు’ అని చంద్ర పేర్కొన్నారు. మరణాలను ధ్రువీకరించే కమిటీని కలిసి ఈ మెథడాలజీని అర్థం చేసుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.





