News

చట్టాలు చేయడం మా సార్వభౌమ హక్కు

576views

పౌరసత్వ సవరణ చట్టం అంశంలో జోక్యాన్ని కోరుతూ ఐరాస మానవ హక్కుల హైకమిషనర్‌(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. సీఏఏ భారత అంతర్గత వ్యవహారాలకు సంబంధించిన అంశమని పేర్కొంటూ వారికి దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. చట్టాలు చేయడం భారత సార్వభౌమ హక్కుగా అభివర్ణించారు. కాబట్టి భారత సార్వభౌమత్వానికి సంబంధించిన విషయాల్లో ఏ విదేశానికి జోక్యం చేసుకునే హక్కు లేదని గట్టిగా నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. సీఏఏ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందనే విషయంలో భారత్‌ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. భారత్‌ ప్రజాస్వామ్య దేశం నిర్దేశించిన చట్టానికి అనుగుణంగా ఇక్కడ పరిపాలన జరుగుతోంది అన్నారు. మా స్వతంత్ర న్యాయవ్యవస్థపై అందరికీ పూర్తి గౌరవం, నమ్మకం ఉంది.. మా గొంతును, చట్టబద్దమైన స్థానాన్ని సుప్రీంకోర్టు నిరూపిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.

సీఏఏ అంశంలో జోక్యాన్ని కోరుతూ యూఎన్‌హెచ్‌ఆర్సీ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు జెనీవాలోని భారత కార్యాలయానికి మానవ హక్కుల హై కమిషనర్‌ సోమవారం తెలియజేశారని విదేశాంగ శాఖ తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.