
దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య మరోసారి చోటు చేసుకున్న ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. మరికొందరు పోలీసులు ఘర్షణలో గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు. ఇక్కడి జఫ్రాబాద్ ప్రాంతంలోని మౌజ్పుర్లో రెండోరోజూ పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. స్వల్ప లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు, దుకాణాలు, ఇళ్లకు CAA వ్యతిరేక ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ దాడులలో ఓ ఫైరింజన్ సైతం ధ్వంసమైందని అధికారులు తెలిపారు. మొత్తం మీద అక్కడి పరిస్థితి భీతావహంగా ఉంది.

అల్లరి మూకల దాడిలో మృతి చెందినహెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్

ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్పుర్-బాబర్ పుర్ మెట్రో స్టేషన్లను మెట్రో అధికారులు మూసివేశారు. 24 గంటల పాటు జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ను మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) పేర్కొంది. ఆదివారం సైతం ఇదే జఫ్రాబాద్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి పాఠకులకు తెలిసిందే. ఘర్షణ, రాళ్ళ దాడులు, దహనాల నేపథ్యంలో ఇరు వర్గాలపై పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.





