
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సంక్రమించే ప్రత్యామ్నాయ స్థలంలో మసీదుతో పాటు ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉత్తర్ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫబోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఇండో-ఇస్లామిక్ రీసెర్చి సెంటర్, లైబ్రరీని కూడా నిర్మించాలని ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకుంది.
యూపీ ప్రభుత్వం ఇవ్వబోయే ఐదెకరాల స్థలాన్ని తీసుకునేందుకు బోర్డు అంగీకరించిందని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జుఫర్ ఫరూకీ తెలిపారు. మసీదు నిర్మాణానికి సంబంధించి ఓ ట్రస్ట్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ”మసీదుతో పాటు ఇండో-ఇస్లామిక్ రీసెర్చి సెంటర్, ప్రజా గ్రంథాలయం, ఛారిటబుల్ ఆస్పత్రి, ఇతర ప్రజాపయోగ సౌకర్యాలు ఆ స్థలంలో కల్పించాలని నిర్ణయించాం” అని ఫరూకీ తెలిపారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మసీదును ఎంత విస్తీర్ణంలో కట్టాలనేది నిర్ణయిస్తామని చెప్పారు.
అయోధ్య స్థల వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని రామ మందిర నిర్మాణానికి కేటాయించాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రామ మందిర నిర్మాణానికి ఇప్పటికే ఓ ట్రస్ట్ ఏర్పాటు అయ్యింది. మందిర నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.





