
పంజాబ్ : పంజాబ్ రాష్ట్రంలోని ఓ గోశాలలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. విషపూరితమైన పశుగ్రాసం తిన్న 45 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా ఫూన్గఢ్ గ్రామంలోని గోశాలలో శుక్రవారం జరిగింది. విషపూరితమైన పశుగ్రాసం తిని 45 ఆవులు మరణించగా మరో 10 ఆవులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అప్రమత్తమైన అక్కడి పశుసంవర్ధక శాఖ అధికారులు గోశాలకు చేరుకుని ఆవుల కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. ఆవులు విషపూరితమైన మేతను తినడం వల్లే అవి మరణించినట్లుగా అనుమానిస్తున్నట్లు గోశాల సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్థానిక మండీ నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసినట్లు సిబ్బంది తెలిపారు. ఆవు నోటిలో నుంచి నురుగు కనిపించింది… ఆవు నోటిలో నుంచి నురుగు కనిపించిందని, ఇది విషపూరితమైనదని వారు చెప్పారు. ఆవుల నమూనాలను కూడా సేకరించి మధుబన్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. కర్నాల్ మునిసిపల్ కార్పొరేషన్ గోశాలను నిర్వహిస్తోంది. ఈ గోశాలకు ఆవులు, పశుగ్రాసాన్ని దాతల నుంచి కొనుగోలు చేస్తారు. గోశాలలో ఆవుల మృతి ఘటనపై విచారణకు అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశామని కర్నాల్ మున్సిపల్ కమిషనర్ గౌరవ్ కుమార్ చెప్పారు. గౌశాల సిబ్బంది వాంగ్మూలం ఆధారంగా పశుగ్రాసం దుకాణం యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మేత నమూనాలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు వివరించారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 429 కింద కేసు నమోదు చేసినట్లు కర్నాల్ పోలీసు సూపరింటెండెంట్ గంగా రామ్ పునియా తెలిపారు.





