News

తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం కొరడా!

263views

ఆరు ఛానెళ్ల పై కేంద్రం వేటు వేసింది. ఈ ఆరు యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు సమాచారాన్ని అందించే నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తున్నాయని గుర్తించింది. ఈ ఛానల్స్‌కు యూట్యూబ్‌లో దాదాపు 20 లక్షల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు. వాటి వీడియోలను 51 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయని తెలిపింది. వరుస ట్వీట్లలో, పీఐబీ ఛానెల్‌ల పేర్లను వాటి ద్వారా వ్యాప్తి చెందుతున్న నకిలీ వార్తలను లిస్ట్ చేసింది. ఈ ఛానెల్‌ల పేర్లు నేషన్‌ టీవీ, సరోకర్ భారత్, నేషన్ 24, సంవాద్ సమాచార్, స్వర్ణిమ్ భారత్, సంబాద్ టీవీలు ఉన్నాయి.

ఇందులో ఓ ఛానల్‌కు 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ YouTube ఛానెల్ ‘సంవాద్ టీవీ’ పేరుతో భారత ప్రభుత్వంపై ఫేక్ న్యూస్‌ని ప్రచారం చేస్తోంది. కేంద్ర మంత్రుల ప్రకటనలపై తప్పుడు వ్యాఖ్యానాలను వీడియోలుగా మార్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. ఈ ఛానెల్ చేస్తున్న తప్పుడు వార్తలను పీఐబీ వరుస ట్వీట్లలో బయటపడింది.

భారతదేశ జాతీయ భద్రతతోపాటు సమగ్రతకు భంగం కలిగించడంతో పాటు.. వివిధ వర్గాల మధ్య ద్వేషాన్ని పెంచుతున్నట్లుగా నిర్ధారించారు. ఈ కారణంగా ఇప్పటి వరకు 104 యూట్యూబ్ ఛానెళ్లు, 45 వీడియోలు, నాలుగు ఫేస్‌బుక్ ఖాతాలు, మూడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్‌సైట్‌లను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌లో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. పీఐబీ ప్యాక్ట్ చెక్ ఈ ఛానెళ్ల అసలు సంగతిని వెలుగులోకి తీసుకొచ్చింది. భారత ఎన్నికలు, సుప్రీంకోర్టు, భారత్ పార్లమెంట్, భారత ప్రభుత్వం పనితీరు వంటి వాటిపై తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నట్లుగా గుర్తించారు.ఇవన్నీ దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లేలా పోస్టులు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 69ఏ కింద చర్యలు తీసుకున్నారు. జాతీయ భద్రతకు విఘాతం కలిగించడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఇచ్చినా, పోస్టులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హెచ్చరించారు.