News

ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి

275views

భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యంలో జరుగుతున్న పెనుమార్పులపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.

సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదులకు మద్దతు అందుతోందన్నారు. కశ్మీర్‌ పరిస్థితిపై స్పందిస్తూ.. 2021 ఫిబ్రవరి నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుందన్న ఆయన.. సరిహద్దులో ఉగ్రవాదం, ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికీ మద్దతు కొనసాగుతుందోన్నారు. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఏదైనా ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన నిల్వలు ఉన్నాయన్నారు. చాలా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని, ఆర్థిక, అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

ఆర్టిలరీ రెజిమెంట్ అంటే ఏంటీ..?

ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఇండియన్‌ ఆర్మీలో రెండో అతిపెద్ద బ్రాంచ్‌. భారత సైన్యానికి గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో సహాయం అందిస్తుంది. ఆర్జిలరి రెజిమెంట్‌ను ప్రధానంగా రెండు భాగాలు విభజించారు. మొదటి భాగం ప్రాణాంతక ఆయుధాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో క్షిపణులు, రాకెట్లు, మోర్టార్లు, తుపాకులు, ఫిరంగులున్నాయి. మరో భాగంలో డ్రోన్‌, రాడార్‌, నిఘా వ్యవస్థ ఉంటాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఈ రిజిమెంట్‌ శత్రువులపై దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించింది.