ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

149views

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహించిన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌తోపాటు సభ్యులుగా ఉన్న జస్టిస్‌ బి.ఆర్‌ గవాయి, జస్టిస్‌ ఎ.ఎస్‌. బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యంలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించగా, జస్టిస్ బి.వి. నాగరత్న మాత్రం వ్యతిరేకిస్తూ ప్రత్యేక తీర్పు వెలువరించారు. దీంతో 4-1 మెజారిటీతో న్యాయమూర్తుల ఆమోదముద్ర పడినట్లయ్యింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై తమ తీర్పును మెజార్టీ న్యాయమూర్తుల తరపున జస్టిస్ గవాయి చదివి వినిపించారు. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం నోట్ల రద్దుకు ఆర్బీఐ కేంద్ర మండలి సిఫార్సు చేయాలి తప్పితే కేంద్ర ప్రభుత్వమే ముందుగా ప్రతిపాదించడానికి వీల్లేదన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందన్న కారణంతో నిర్ణయాన్ని తప్పుబట్టలేని తెలియజేశారు. ఇలాంటి నిర్ణయాలను అత్యంత గోప్యంగా, వేగంగా తీసుకోవాలని.. ఒకవేళ విషయం బయటకు పొక్కితే.. తలెత్తే పరిణామాలు ఊహించడమూ కష్టమేనని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి విషయాలను రహస్యంగా ఉంచడానికి అత్యంత ప్రాధాన్యం ఉందని తెలిపింది.

కేంద్రానికి నోట్లు రద్దు చేసే అధికారం ఉంది..
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 26(2) ప్రకారం ఏ నోట్లనైనా రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీం స్పష్టం చేసింది. పెద్దనోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐ మధ్య ఆరు నెలలుగా సంప్రదింపులు జరిగాయని.. నల్లధనం, ఉగ్రనిధులు వంటివాటిని నిర్మూలించేందుకు ఒక హేతుబద్ధమైన ఆలోచన ద్వారానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నట్లు ధర్మాసనం తెలియజేసింది. ఇక్కడ లక్ష్యాలు చేరుకున్నారా లేదా అన్నది అప్రస్తుతం అని చెప్పింది. పెద్దనోట్ల రద్దు నోటిపికేషన్లో ఎలాంటి లోపాలూ లేవు. నోట్లను రద్దుచేసే స్వతంత్ర అధికారం ఆర్బీఐకి లేదు. పాతనోట్ల మార్చి డికి ఇచ్చిన 52 రోజుల సమయం సహేతుకం కాదని చెప్పలేం అని జస్టిస్ బీఆర్ గవాయి పేర్కొన్నారు. గతంలో రెండు సందర్భాల్లో పెద్దనోట్ల రద్దును చట్టం ద్వారా చేసినంతమాత్రాన కేంద్రానికి ఈ అధికారం లేదని చెప్పలేమని స్పష్టం చేశారు. చివరికి పిటిషనర్ల వాదనను ధర్మాసనం తిరస్కరిస్తోందని ప్రకటించారు.

జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు ఇలా..
పెద్దనోట్ల రద్దు చాలా పెద్ద విషయమని ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా వెలువరించకూడదని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఆ నిర్ణయం సదుద్దేశంతో బాగా ఆలోచించి తీసుకున్నదే అయినప్పటికీ దాన్ని చట్టబద్ధంగా, న్యాయప్రాతిపదికగా చేయాలి తప్పితే, ఉద్దేశాల ఆధారంగా కాదని 120 పేజీల తీర్పులో అభిప్రాయపడ్డారు. “ఒక నిర్దిష్టమైన సిరీస్ నోట్లను రద్దు చేయడంతో పోలిస్తే మొత్తం పెద్దనోట్లను రద్దు చేయాలనుకోవడం చాలా సీరియస్ అంశం. దాన్ని చట్టం ద్వారానే చేసి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. గోప్యత ఇమిడిఉంటే ఆర్డినెన్స్ ద్వారానైనా చేయాల్సిందని.. నోట్ల రద్దును కేంద్రమే కోరుకున్నట్లు ఆర్బీఐ రికార్డులు ద్వారా తెలుస్తోంది. ఆర్బీఐ స్వతంత్రంగా ఆలోచించలేదని స్పష్టమవుతోంది. మొత్తం కసరత్తును 24 గంటల్లో పూర్తిచేశారు. పార్లమెంటు ద్వారా చేయాల్సిన పనిని ఒక్క నోటిఫికేషన్తో చేశారు” అని తప్పుబట్టారు. ఆ నోటిఫికేషన్ శాసనవిరుద్ధమైనదని చెప్పారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)లో పేర్కొన్న ‘ఎనీ సీరీస్’కు అర్థం అన్ని నోట్లను రద్దుచేసే అధికారం కాదన్నారు. ఆ సెక్షన్ నిర్దిష్టమైన సీరీస్ కరెన్సీ నోట్ల రద్దు గురించి మాత్రమే చెబుతోంది తప్పితే మొత్తం నోట్ల గురించి కాదని పేర్కొ న్నారు. నోట్లరద్దు ప్రతిపాదన ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నుంచి మాత్రమే రావాలని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చి ఇప్పటికే ఆరేళ్లు పూర్తయినందున ఇప్పుడు యథాపూర్వ స్థితిని తీసుకురాలేమనీ, కొత్తగా ఉపశమనం కలిగించలేమని పేర్కొన్నారు. ‘రద్దు చేసిన నోట్లలో 98 శాతాన్ని బ్యాంకుల ద్వారా తిరిగి మార్చుకున్నట్లు రికార్డయిందని.. కొత్తగా రూ.2,000 నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ప్రకారం చూస్తే ప్రభుత్వ చర్య ద్వారా ఆశించిన ఫలితం రాలేదని స్పష్టమవుతోంది’ అని జస్టిస్ నాగరత్న చెప్పారు. అయితే.. ఆ ప్రయత్నం వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం మాత్రం అభినందనీయమన్నారు.