
నోయిడా: ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోన్న వేళ రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నప్పటికీ భారత్ మాత్రం చౌకలో లభిస్తున్న ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోన్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి దిగుమతి చేసుకొనే చమురు ధరపై జీ-7 కూటమి పరిమితిని ప్రతిపాదించింది. అయినప్పటికీ భారత్ ఎటువంటి ఒత్తిడికి గురికావడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.
‘అది జరిగినప్పుడు దానిపై ఆలోచిస్తాం. మోదీ ప్రభుత్వం దానిని ఒత్తిడిగా భావించడం లేదు. మాకు ఎలాంటి భయం, ఆందోళన లేదు. సరఫరాలో ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాం’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న వరల్డ్ ఎల్పీజీ వీక్-2022లో పాల్గొన్న ఆయన.. రష్యా ఇంధనం దిగుమతిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Source: Eenadu