
భరూచ్: స్వాతంత్య్రానంతరం దేశంలోని సంస్థానాల విలీనం సమస్యను సర్దార్ వల్లభాయ్ పటేల్ పరిష్కరించారని, కాని ‘ఒక వ్యక్తి’ మాత్రం కశ్మీరు సమస్యను పరిష్కరించలేకపోయారని అంటూ పరోక్షంగా తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.
ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లోని భరూచ్ జిల్లాకు చెందిన వల్లభ్ విద్యానగర్లో సోమవారం ఒక బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుస్తున్న తాను దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న కశ్మీరు సమస్యను పరిష్కరించి గలిగానని చెప్పారు.
సర్దార్ పటేల్ మానసిక పుత్రిక సర్దార్ సరోవర్ డ్యాం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ‘అర్బన్ నక్సల్స్’ ప్రయత్నించారని కూడా ఆయన ఆరోపించారు. భారతదేశంలో విలీనం కావాలంటూ అన్ని సంస్థానాలను సర్దార్ పటేల్ నచ్చచెప్పి ఒప్పించారని, కాని, కశ్మీరు సమస్యను మరో వ్యక్తి మాత్రం చక్కబెట్టలేకపోయారంటూ పరోక్షంగా నెహ్రూపై ప్రధాని విమర్శనాస్త్రాలు సంధించారు.
Source: Nijamtoday