
తిరుపతి: టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజిని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫోటో ప్రేమ్లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్లు తదితర ఉత్పత్తులకు భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. టీటీడీ డ్రై ఫ్లవర్ టెక్నాలజితో తయారుచేసిన కళాకృతులను సీఎం సహా పలువురు కేంద్ర మంత్రులు అభినందించారు.
డ్రై ఫ్లవర్ టెక్నాలజితో కళాకృతులు తయారు చేయడానికి టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో 2021 సెప్టెంబరు 13వ తేదీన ఎంఓయు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2021 సెప్టెంబర్ 28వ తేదీ నుండి తిరుపతిలోని సిట్రస్ రిసెర్చ్ స్టేషన్లో మహిళలకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. దాదాపు 350 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు.
ఒక మహిళ రోజుకు రెండు చిత్రపటాలను తయారు చేయవచ్చు. చిత్రపటాల తయారీకి పూలను ఎండబెట్టడానికి సుమారు మూడు నుండి నాలుగు రోజులు పడుతుంది. ఇప్పటివరకు శిక్షణ పొందిన మహిళలు 22,219 ఏ ఫోర్ సైజ్ చిత్రపటాలు, 850 వివిధ రకాల కళాకృతులు తయారు చేశారు. ఒక కోటి 19 లక్షల 26 వేల 56 రూపాయల విలువ గల ఉత్పత్తులను తయారు చేశారు.





