
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధుల కేసులో పాపులర్ ఆఫ్ ఇండియా కార్యాలయాలపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, ఉగ్ర సంస్థల్లో చేర్చేందుకు సమాయత్తం చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడుతున్న 100 మంది పీఎఫ్ఐకి చెందిన కార్యకర్తలను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ దాడులు ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు సహా దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో గురువారం వేకువజామున జరిగాయి. రెండు రోజుల కిందట తెలంగాణలోని నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించి పలువురు పీఎఫ్ఐకి చెందిన వారిని అదుపులోకి తీసుకుంది. వీరిని హైదరాబాద్లో ప్రశ్నిస్తున్నారు.
‘ఇప్పటి వరకు ఇవే అతిపెద్ద దాడులు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం, నిషేధిత సంస్థలలో చేరడానికి వ్యక్తులను ప్రోత్సహించడం వంటి ఆరోపణలతో సోదాలు జరుగుతున్నాయి. పీఎఫ్ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతల ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరుగుతున్నాయి.’ అని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
Source: EtvBharat