
న్యూఢిల్లీ: టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా పీఎం-కేర్స్ ఫండ్ ట్రస్టీగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్, లోక్సభ మాజీ ఉప సభాపతి కరియ ముండా కూడా ట్రస్టీలుగా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ ఫండ్ బోర్డు ట్రస్టీల సమావేశం మంగళవారం జరిగింది. ట్రస్టీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలను ప్రధాని మోదీ స్వాగతించారు.
కాగా, పీఎం కేర్స్ ఫండ్కు సలహా బోర్డు ఏర్పాటు కోసం ప్రముఖ వ్యక్తులను నామినేట్ చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షా బోర్డు సలహాదారులుగా ఉండనున్నారు.
Source: Nijamtoday





