
408views
తిరుపతి: ‘తిరుమల లో ఈనెల 27 నుంచి అక్టోబరు అయిదో తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వచ్చేవారికి అన్నప్రసాద వితరణ చేస్తున్నాం. అన్నదానం పేరిట ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు విరాళాలు అడిగితే ఇవ్వకండి’ అంటూ భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో అన్నదానం చేస్తామంటూ సికింద్రాబాద్కు చెందిన అనంతగోవిందదాస ట్రస్టు భక్తుల నుంచి విరాళాలు కోరడాన్ని టీటీడీ గుర్తించింది. దీనికోసం బ్యాంక్ అకౌంట్ నెంబరును కూడా ట్రస్టు అందుబాటులో ఉంచింది. ఈ ట్రస్టుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి సంస్థలు, వ్యక్తుల మాటలు నమ్మవద్దని భక్తులను కోరింది. అక్రమంగా విరాళాలు సేకరించే ఇలాంటి ట్రస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొంది.





