
బెనారస్: 11 రకాల కరోనా వేరియంట్లపై సమర్థంగా పోరాడి, వాటిని నాశనం చేయగల ప్రత్యేక కషాయాన్ని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వైద్యులు, పరిశోధకులు తయారుచేశారు. పేరు ‘గోజీహ్వాదీ క్వాత్’ అనేది ఆయుర్వేద ఔషధం.
దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు, నాసికా అవరోధాలు.. వాసన, రుచి తగ్గడం మొదలైన సమస్యల నివారణకు ఆయుర్వేదంలో దీన్ని వాడుతుంటారు. అయితే, ఈ విశ్వవిద్యాలయానికి చెందిన ఆయుర్వేద వైద్య నిపుణులు పరమేశ్వరప్ప, సుశీల్కుమార్ దుబే, బయోఇన్ఫర్మేటిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజీవ్ మిశ్రల బృందం ఈ ఔషధానికి సిట్రస్ జాతికి చెందిన పలు మొక్కల భాగాలను జోడించి ప్రత్యేకంగా కషాయం రూపొందించింది.
కొవిడ్ మూడో ఉద్ధృతి సమయంలో 500 మంది బాధితులకు రోజూ రెండు డోసులుగా ఈ కషాయంను ఇచ్చి చూశారు. ఇందులోని ఫైటోకెమికల్ ఫార్చునెలిన్ అనే పదార్థం శరీరంలోని కరోనా వేరియంట్లను నాశనం చేస్తుందని గుర్తించారు.





