News

ఇక ఎలక్ట్రిక్‌ హైవేలు – అభివృద్ధికి కేంద్రం కసరత్తు

301views

* కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడి

విద్యుత్‌ వాహనాలను మరింత ప్రోత్సహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సోలార్‌ ఎనర్జీ సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులు పరుగులు పెట్టేందుకు వీలుగా ఎలక్ట్రిక్‌ హైవేలు అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. ఇండో-అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్‌ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఎలక్ట్రిసిటీతో నడిచే విధంగా దేశ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం సోలార్‌, పవన విద్యుత్‌ ఆధారిత ఛార్జింగ్‌ మెకానిజంను ఉపయోగించుకోవాలన్న దృఢ నిశ్చయంతో ప్రభుత్వం ఉందని గడ్కరీ చెప్పారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ హైవేలను అభివృద్ధి చేసే అంశంపైనా పనిచేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రోడ్లపై వెళ్లే ట్రక్కులు, బస్సులు సోలార్‌ ఎనర్జీని వినియోగించుకుంటాయని వివరించారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల్లో సైతం సోలార్‌ ఎనర్జీని వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 26 గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్ ‌ప్రెస్‌ వేలను నిర్మిస్తున్నామని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ హైవేలు అంటే..?

ఎలక్ట్రిక్‌ హైవేలను సులువుగా చెప్పాలంటే.. ఇవీ రైల్వే లైన్లనే పోలి ఉంటాయి. రైళ్లు నడిచేటప్పుడు ఏ విధంగా అయితే పైనున్న విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని పరుగులు తీస్తాయో.. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలు సైతం అదే విధంగా విద్యుత్‌ లైన్లను ఉపయోగించుకుని వాహనంలోని బ్యాటరీని ఛార్జ్‌ చేసుకుంటాయి. సోలార్‌ ఎనర్జీని ఇందుకోసం వినియోగించుకుంటాయి. ప్రధాన కారిడార్‌లో ఏ రూట్‌లో ఈ ఎలక్ట్రిక్ హైవేలు అభివృద్ధి చేయాలన్న దానిపై కసరత్తు జరుగుతోందని గడ్కరీ వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.