News

పలు రాష్ట్రాల్లో NIA దాడులు

130views

*  గ్యాంగ్ ‌స్టర్ల ఆటకట్టించేందుకే

* వెల్లడవుతున్న విస్మయకర వాస్తవాలు

గ్యాంగ్ ‌స్టర్ల ఆటకట్టించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం భారీస్థాయిలో దాడులు చేపట్టింది. ఉత్తరభారత్ ‌లో దాదాపు 60 ప్రాంతాల్లో NIA దాడులు నిర్వహించింది. హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌, ఢిల్లీల స్థానిక పోలీసుల సహకారంతో పలువురు గ్యాంగ్ ‌స్టర్లకు చెందిన ప్రాంగణాల్లో ఈ సోదాలు జరిగాయి.

లారెన్స్ బిష్ణోయ్, బంబిహా, నీరజ్ బవానా గ్యాంగ్ ‌లకు చెందిన 10 మందిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం (UAPA) కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులను ఎన్‌ఐఏ విచారణ జరుపుతోంది. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన నిందితులకు, ఉగ్ర గ్రూపులకు మధ్య బలమైన సంబంధాలున్నాయని పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్ ఇంతకు ముందే వెల్లడించారు. వీరి బంధాన్ని ఐఎస్‌ఐ ఉపయోగించుకుంటోందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా జైళ్లలో ఉండి కార్యకలాపాలు సాగిస్తోన్న వారిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం ఎన్‌ఐఏ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్‌ఐఏ గురిలో గోల్డీ బ్రార్ కూడా ఉన్నాడు. అతడు కెనడా నుంచే మూసేవాలా హత్యకు ప్రణాళిక వేసి, అమలు చేసిన సంగతి తెలిసిందే.

అలాగే ఆయుధాల స్మగ్లింగ్‌ చేసేవారిపై కూడా ఎన్‌ఐఏ దృష్టిసారించింది. ఎన్‌ఐఏ నివేదిక ప్రకారం, నీరజ్ బవానా, అతడి గ్యాంగ్…‌ ప్రముఖ వ్యక్తులే లక్ష్యంగా హత్యలకు పాల్పడుతోన్నట్లు, సోషల్ మీడియా వేదికగా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నీరజ్‌ గ్యాంగ్ ‌కు, లారెన్స్‌ బిష్ణోయ్ ‌కు మధ్య విభేదాలున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూసేవాలా హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మరణానికి లారెన్స్‌ గ్యాంగ్ ‌పై ప్రతీకారం తీర్చుకుంటామని నీరజ్ బవానా ప్రకటించారు. లారెన్స్‌, గోల్డీ బ్రార్ సహా పలువురు గ్యాంగ్ ‌స్టర్లు దేశంలోని పలు జైళ్లతో పాటు, కెనడా, పాకిస్థాన్‌, దుబాయ్‌ వంటి దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ ‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.