
శుక్రవారం 2/9/2022) నాడు కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ‘INS విక్రాంత్’ విమాన వాహక యుద్ద నౌకను జాతికి అంకితం చేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నౌకను పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కొచ్చి షిప్ యార్డ్ నిర్మించింది. దీంతో, విమాన వాహక యుద్ద నౌకలను స్వయంగా నిర్మించుకోగల సత్తా కలిగిన అతి కొద్దిదేశాల సరసన భారత్ చేరింది. ఇది ఆత్మ నిర్భర్ భారత్ లో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
దేశానికి మువ్వన్నెల జెండా జాతీయ పతాకంగా ఉన్నట్లే త్రివిధ దళాలకు కూడా వేర్వేరుగా ప్రత్యేక జెండాలు ఉంటాయి. ఇన్నాళ్ళూ భారత నావికా దళానికి చెందిన పతాకంలో జాతీయ జెండాతో పాటు బ్రిటీష్ వలస పాలనకు సంకేతంగా ‘సెయింట్ జార్జి క్రాస్’ కూడా ఉండేది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట మీద నుండి ప్రధాని ప్రసంగిస్తూ బ్రిటిష్ వలస పాలనకు, బానిసత్వానికి నిదర్శనంగా నిలిచే గుర్తులను మన మనస్సుల నుండి చెరిపేసి నూతన భారతదేశాన్ని ఆవిష్కరించే సమయం ఆసన్నమైందని అన్నారు. అందులో భాగంగానే భారత నౌకదళం పతాకం నుండి సెయింట్ జార్జి క్రాస్ తొలగించి దాని స్థానంలో భారతదేశంలో గొప్ప నౌకాదళాన్ని నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అష్ట దిక్కుల నౌకాదళ చిహ్నం, మూడు సింహాలతో కూడిన నూతన చిహన్ని చేర్చిన నూతన పతాకాన్ని ఆవిష్కరించారు.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విశేషం ఏమిటంటే INS విక్రాంత్ నినాదం సంస్కృతంలో “जयेम सं युधिस्पृध:” అంటే “I defeat those who fight against me” “నాకు వ్యతిరేకంగా పోరాడితే, నేను ఓడిస్తా!” ఇదీ నేటి సశక్త భారతం. స్వాభిమాన భారతం. శత్రు దుర్భేధ్య భారతం.
“కదిలే నగరం (CITY ON THE MOVE)” అని పిలువగలిగిన ఈ నౌక దేశ చరిత్రలోనే ఇప్పటివరకూ నిర్మించిన అతిపెద్ద విమాన వాహక నౌక. INS విక్రాంత్ గురించి ఇప్పటివరకూ మనకు తెలిసిన కొన్ని విషయాలివిగో…
1.భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఇది. భారతదేశంలో రూపొందించబడిన అతిపెద్ద యుద్ధనౌక. దీని పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు.
2. దీనిని 20,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. 45,000 టన్నుల బరువున్న యుద్ధనౌక ఇది. ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద యుద్ధ నౌక.
3. INS విక్రాంత్ యొక్క ఫ్లైట్ డెక్ రెండు ఫుట్బాల్ మైదానాలంత పెద్దది. 18 అంతస్తుల భవనమంత ఎత్తులో ఉంది.
4. ఈ యుద్ధనౌకను రూపొందించడానికి ఒక దశాబ్దం పాటు పట్టింది. ఇందులో 2400 కంపార్ట్మెంట్లు ఉన్నాయి.
5.ఇది 28 నాట్ ల గరిష్ట వేగంతో, ఏకధాటిగా 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. ఈ దూరం దాదాపు 14,000 కి.మీకి సమానం.
6. ఇందులో 16,000 మంది సిబ్బంది సరిపోతారు. INS విక్రాంత్ లో ఒకేసారి 30 విమానాలను తీసుకెళ్ళొచ్చు.
7. దీని హ్యాంగర్ రెండు ఒలింపిక్ – ఈత కొలనులంత పెద్దది. ఇందులో గంటకు 3000 చపాతీలు తయారు చేయగల చక్కటి కిచెన్ యూనిట్ ఉంది.
8.INS విక్రాంత్ లో 16 పడకల ఆసుపత్రి ఉంది. ఇందులో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, రేడియాలజీ వింగ్, ఇతర వైద్య సదుపాయాలతో పాటు అత్యవసర వైద్య సంరక్షణ యూనిట్ కూడా ఉంది.
9. 250 ట్యాంకర్ల ఇంధన నిల్వ సామర్థ్యం భారతదేశంలో తయారు చేయబడిన ఈ అతిపెద్ద నౌక స్వంతం.
10. ప్రస్తుతానికి INS విక్రాంత్, మిగ్ ఫైటర్ జెట్లతో పాటు హెలికాప్టర్లను తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంది. అధికారుల నుంచి అందే తదుపరి ఆదేశాల మేరకు నేవీ, INS విక్రాంత్ పై ట్రయల్స్ నిర్వహిస్తుంది.

Source : THE TELEGRAPH





