
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సోమవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్లో ఘనంగా జరిగింది. చైర్మన్, మెంబర్ సెక్రటరీతో కలుపుకొని మొత్తం 21 మంది సభ్యులతో కూడిన ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జి.ఓ.ఎంఎస్.నెం.571 ను ఈ నెల 13 న జారీచేసిన విషయం విదితమే. ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ , దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ సభ్యులుగా, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్ మెంబర్ సెక్రటరీగా, మరో 18 మంది సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ఎంతో ఘనంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో టి.టి.డి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎ.వి.ధర్మారెడ్డి, వై.ఎస్.ఆర్.జిల్లా పుష్పగిరి మఠాధిపతి జూమ్ కన్పరెన్సురెన్సు ద్వారా ప్రమాణ స్వీకారం చేశారు.
మిగిలిన సభ్యులు భీమవరానికి చెందిన దంతులూరి జగన్నాథరాజు చౌల్ట్రీ ఫౌండర్ ట్రస్టీ ఎం.రామకుమార్ రాజు, అన్నవరానికి చెందిన ఇనుగంటి వెంకట రోహిత్, కడపకు చెందిన యదళ్ల పిచ్చియ్య చెట్టి చారిటీస్ అసోషియేషన్ ఫౌండర్ డాక్టర్ జ్వాలా చైతన్య, మాకా బాలాజీ, పాలకొల్లుకు చెందిన శ్రీ చాకావారి చౌల్ట్రీ ఫౌండర్ చాకా ప్రభాకరరావు, రాజన్ సుభాషిణి, తిరుమల పెదజీయంగార్ మఠాధిపతి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు, రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి అజయ కల్లాం, దేవాదాయ శాఖ రిటైర్డు అడిషనల్ కమిషనర్ ఎ.బి.కృష్ణారెడ్డి, హైకోర్టు రిటైర్డు జడ్జి మఠం వెంకట రమణ, రిటైర్డు ప్రిన్సిఫల్ స్పెషల్ జడ్జి కె.సూర్యారావు, ఫిలాంత్రోఫిస్టులు సంగా నరసింహారావు, యు.కె.విశ్వనాథరాజు, ఆగమ పండితులు పి.వి.ఎస్.ఎస్.ఆర్.జగన్నాథాచార్యులు, చర్రావూరి శ్రీరామ శర్మ, చార్టెడ్ ఎక్కౌంటెంట్ శ్రీరామమూర్తి తదితరులు నేరుగా పాల్గొని సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.





