
భాగ్యనగరం: మునుగోడులో జరుగనున్న ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఆయనను గెలిపిస్తే తెలంగాణాలో కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. కేసీఆర్ సర్కార్ను పడగొట్టేందుకు రాజగోపాల్రెడ్డి బీజేపీలోకి చేరారని ‘మునుగోడు సమరభేరి’ పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆదివారం ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు.
మజ్లిస్ భయంతోనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపట్లేదని.. బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని జరిపిస్తామని అమిత్షా ప్రకటించారు. ‘‘పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కేసీఆర్ ఇచ్చారా?. నిరుద్యోగులు రూ.3 వేలు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్నారు. నల్లగొండ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం అయ్యిందా’’ అంటూ అమిత్ షా ప్రశ్నించారు.
Source: Nijamtoday





