News

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ

400views

భాగ్య‌న‌గ‌రం: ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఆదివారం సమావేశం అయ్యారు. మునుగోడులో బహిరంగసభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్ళారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్‌, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.

సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల ప్రస్తావన

జూనియర్‌తో భేటీ సందర్భంగా అమిత్‌షా సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావించినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌ నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ సినిమాలు తాను చూశానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసేవారని ప్రశంసించారు.

 

ప్రతిభావంతుడైన నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌: అమిత్‌షా ట్వీట్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశ విషయాన్ని అమిత్‌ షా ట్విటర్‌లో వెల్లడించారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది’ అని బీజేపీ అగ్రనేత పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి