
-
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని బెకాన్ గంజ్ ప్రాంతంలో చోటుచేసుకున్న హింసాకాండ వెనుక ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) హస్తం ఉండొచ్చని ఉత్తరప్రదేశ్ పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు కాన్పూర్ అల్లర్ల మూలాలు పశ్చిమ బెంగాల్, మణిపూర్లలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ నెల మూడోతేదీన పశ్చిమ బెంగాల్, మణిపూర్లో మార్కెట్ బంద్కు పిఎఫ్ఐ పిలుపునిచ్చిందని కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు. అదే రోజు కాన్పూర్ లోనూ ముస్లింల ప్రార్థనల అనంతరం మార్కెట్ను మూసివేసే సమయంలో కాన్పూర్లో హింస చెలరేగిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
ఈ అల్లర్ల వెనుక ఉగ్రవాద సంస్థ పీఎఫ్ఐ హస్తముందని భావిస్తున్నామన్న ఆయన..కాన్పూర్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు పీఎఫ్ఐ నిధులు అందించినట్టు పేర్కొన్నారు. ఇందులో వాస్తవాలను తేల్చేందుకు అల్లర్ల సమయంలో అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి సీజ్ చేసిన ఆరు మొబైల్స్ లో, కాల్ డేటాను పరిశీలించడంతో పాటు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని ముఖ్యమైన పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపినట్టు కాన్పూర్ పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనా తెలిపారు.
మరోవైపు కాన్పూర్ అల్లర్లకు సంబంధించి మాస్టర్ మైండ్.. హయత్ జాఫర్, జావేద్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ రహిన్, మొహమ్మద్ సుఫ్యాన్ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు జావేద్ లక్నోలోని హజ్రత్గంజ్లో తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, కాన్పూర్ అల్లర్ల సమయంలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘటన జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాన్పూర్ గ్రామీణ ప్రాంతంలోని పరౌంఖ్ గ్రామంలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెంట ఉండడం గమనార్హం.