
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. పెద్దసంఖ్యలో తరలివస్తున్న భక్తులు తిరుమలలో వసతి గదుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తిరుమల కొండపై పరిమిత సంఖ్యలో ఉన్న వసతి గదులను కరెంటు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు కేటాయిస్తున్నారు. కరెంటు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తుల ఫోన్లకు వసతి గది కేటాయింపు వివరాలతో సంక్షిప్త సందేశం వచ్చేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే…రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భక్తులకు సంక్షిప్త సందేశాలు ఆలస్యంగా వస్తున్నాయి.
టీటీడీ కార్యాలయంలో గదిని కేటాయిస్తూ జనరేట్ అయిన మెసేజ్ భక్తుల ఫోన్కు వచ్చే సరికి రెండు నుంచి మూడు గంటలు ఆలస్యమవుతోంది. తమ ఫోన్కు మెసేజ్ వచ్చిన తర్వాత భక్తులు విచారణ కార్యాలయానికి గది కోసం వెలుతున్నారు. అప్పటికే రెండు గంటలు దాటిపోవడంతో గది కేటాయింపు రద్దయిపోతోంది. సర్వర్ సమస్యలు, సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల సందేశాలు ఆలస్యంగా వస్తుండంతో భక్తులు గదులు పొందలేక మరోసారి కరెంటు రిజిస్ట్రేషన్ కోసం వరుసల్లో నిలబడి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. సర్వర్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు సాకుగా చూపుతూ టీటీడీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.





